తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు అండగా ఉంటాం. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవి. యాజమాన్యాల తీరు మారాలి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించాలి. నిష్పక్షపాత వైఖరితోనే జర్నలిజం విలువలు కాపాడబడతాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జర్నలిస్టులు సాహసోపేతంగా పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరుల భద్రతకు పెద్దపీట వేయాలి.ఐక్యతతోనే జర్నలిస్టుల హక్కుల సాధన సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్గా తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.జర్నలిస్టుల హక్కుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తృతీయ మహాసభ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో ఘనంగా జరిగింది. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అమోఘమైనదని, క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని మీడియా యాజమాన్యాల తీరు మారాల్సిన అవసరం ఉందని, రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం, వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సుదీర్ఘకాల సమస్య అయిన ఇండ్ల స్థలాల అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు తాను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి హెల్త్ కార్డూ, ఇండ్ల స్థలాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమాజంలో నిష్పక్షపాత వైఖరితో వార్తలు రాసినప్పుడే జర్నలిజం విలువలు కాపాడబడతాయని, వృత్తిపరమైన బాధ్యతను విస్మరించవద్దని సూచించారు. జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, అప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి కుటుంబాల భద్రతకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ