తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సభకు పట్టణంలోని నలుమూలల నుండి ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో ప్రముఖ ముస్లిం స్కాలర్లు సల్మాన్ నక్ష్బందీ, డాక్టర్ హాఫిజుల్ రహమాన్, బ్రదర్ సిరాజ్తో పాటు ప్రముఖ హిందూ స్కాలర్ లక్ష్మి శంకరాచార్య పాల్గొని ప్రసంగించారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మి శంకరాచార్య మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ గొప్పతనాన్ని కొనియాడారు. నేటి ముస్లిం సమాజం ప్రవక్త మహమ్మద్ ఆచరణలకు దూరమై జీవితాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రవక్త మహమ్మద్ చెప్పిన విధంగా జీవిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ ముస్లింలకు మాత్రమే ప్రవక్త కాదని, ప్రపంచంలోని ప్రతి మానవుడికి ప్రవక్త అని తెలిపారు. సభలో పాల్గొన్న ప్రముఖ స్కాలర్ బ్రదర్ సిరాజ్ మాట్లాడుతూ ఇస్లాం మతం కత్తులతో వ్యాప్తి చెందిందని నేడు చాలామంది హిందూ సోదరులు భావిస్తున్నారని అన్నారు. అయితే ప్రవక్త మహమ్మద్ మరణానికి ఆరు సంవత్సరాల ముందే గుజరాత్ రాష్ట్రంలో ఒక మసీదు నిర్మించబడిందని తెలిపారు. విదేశాల నుంచి వాణిజ్యం కోసం వచ్చిన వారే ఆ మసీదును నిర్మించారని పేర్కొన్నారు. డాక్టర్ హాఫిజుల్ రహమాన్ మాట్లాడుతూ ముస్లిం సమాజం నేడు ఆకలితో ఉన్న పేదలను, ఇబ్బందుల్లో ఉన్న తోటి స్నేహితులను, అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరులను పట్టించుకోవడం నేటి ముస్లిం సమాజం మానేసిందన్నారు. నష్టాల్లో ఉన్న తోటి వ్యాపారులు, డబ్బుల్లేక చదువుకు దూరమవుతున్న పిల్లల గురించి కూడా ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఎవరికి వారు స్వార్థం కోసం జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవక్త మహమ్మద్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ జీవితాన్ని గడిపితే దేశంలో నేడు ముస్లిమ్ సమాజం పై కొందరు చేస్తున్న విద్వేషపు మంటలు కొనసాగేవి కాదని ఇలాంటి పరిస్థితులు వొచ్చేవి కాదన్నారు. ఇకనైనా ప్రతి ఒక్క ముస్లిం కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని అలాగే తోటి హిందూ సోదరుల పట్ల కూడా సహాయ గుణంతో, ప్రేమతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రముఖ స్కాలర్ సల్మాన్ నక్ష్బందీ మాట్లాడుతూ ప్రతి కాలంలో ఒక ప్రవక్త అవతరించి, మానవాళి మనుగడ ఎలా సాగించాలో తెలియజేశారని అన్నారు. కొన్ని లక్షల మంది ప్రవక్తలు ఈ భూమిపైకి వచ్చారని, ప్రతి ఒక్కరూ మానవాళికి సృష్టికర్త సందేశాన్ని తెలియజేశారని తెలిపారు. అయితే ప్రవక్తలందరిలో చివరిగా వచ్చిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని సమస్త మానవాళికి జీవితం ఎలా గడపాలో ఆఖరి సందేశం తెలుపడం కోసం ఆ సృష్టికర్త మొహమ్మద్ ప్రవక్తను పంపించారాని తాను ఇచ్చిన సందేశం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇకపై ఏ ప్రవక్త రారని, సమస్త మానవాళి ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని తెలుసుకోవాలని సల్మాన్ నక్ష్బందీ సూచించారు. సభలో పలువురు ముస్లిమ్ మత పెద్దలు కొత్తగూడెం పట్టణ రాజకీయ ప్రముఖులు మరియు ముస్లిమ్ ఐక్య సంఘం ప్రెసిడెంట్ మౌలానా ముజహిద్, వైస్ ప్రెసిడెంట్ షైక్ హుస్సేన్, సెక్రటరీ గౌసుద్దీన్, అబిద్ హుస్సేన్, మొహమ్మద్ జియా తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ