తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో మధ్యాహ్నం 3.00 గంటల వరకు మొత్తం 65.18 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 1,20,808 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో అశ్వరావుపేట మున్సిపాలిటీలో 70.76 శాతం పోలింగ్ నమోదు కాగా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 66.31 శాతం, ఇల్లందు మున్సిపాలిటీలో 57.87 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వరావుపేటలో మొత్తం 16,850 మంది ఓటర్లలో 11,923 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లలో 89,370 మంది, ఇల్లందులో 33,723 మంది ఓటర్లలో 19,515 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఓటర్లు మిగిలిన సమయంలో కూడా అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు
Admin
తెలుగు వెలుగు టీవీ