తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలసి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు-కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నదని, అందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 168 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యాన్ని ఏ, బి గ్రేడ్లుగా విభజించి మద్దతు ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389, బి గ్రేడ్కు రూ. 2369 ధరలు నిర్ణయించగా, సన్న రకం వడ్లకు అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వబడుతుందని వెల్లడించారు.ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు ఎండబారకుండా టెంట్లు, షెడ్ నెట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి తగిన నీడ కల్పించాలని సూచించారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో రద్దీ నియంత్రణ కోసం క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని, అవసరమైన ఏర్పాట్లపై చెక్లిస్ట్ జారీ చేసి, దాని ప్రకారం చర్యలు తీసుకొని ధృవీకరణ నివేదికలు సమర్పించాలని సూచించారు.సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా జిల్లాలో చెక్పోస్టుల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు ఆన్లైన్ నమోదు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, రవాణాలో జాప్యం జరగకుండా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ధాన్యం విక్రయాలపై రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే రైతులకు మెరుగైన ధర లభిస్తుందని, రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత సెంటర్ ఇన్చార్జ్లు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధాన్యం విక్రయానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాలని సూచించారు. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు. గన్నీ సంచులు సరిపడా నిల్వలో ఉంచి, ఆన్లైన్ నమోదు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని, వాటి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు సిద్ధంగా ఉంచాలని, బ్యానర్ల ద్వారా మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాలు, అధికారుల సంప్రదింపు వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. సన్న వడ్లు, దొడ్డు వడ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ధాన్యం కొనుగోలు సమయంలో ఐరిస్ స్కానర్ ద్వారా మాత్రమే ప్రక్రియ పూర్తి అవుతుందని, డేటా ఎంట్రీ సమయంలో రైతు తప్పనిసరిగా హాజరుగా ఉండాలని తెలిపారు. తూకపు పరికరాలను తనిఖీ చేసి సీల్స్ వేయాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్ డి ఓ మధు,పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు , పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ , వ్యవసాయ అధికారి బాబురావు, తూనికలు-కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ