తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్లు ఛానల్లో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి వాస్తవాలు, ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలను ప్రసారం చేయడం మీడియా బాధ్యతకు విరుద్ధమన్నారు. ప్రజలకు నిజాలను అందించాల్సిన మీడియా సంస్థలు ధృవీకరణ లేకుండా సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రజల్లో అయోమయం సృష్టించడంతో పాటు ప్రజా ప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమేనని విమర్శించారు.కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, కార్మికులు, రైతులు, గిరిజనులు, పేదల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారని వంగ వెంకట్ పేర్కొన్నారు.సీపీఐ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి రాజకీయంగా తట్టుకోలేని కొందరు కావాలనే అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.రాజకీయ లబ్ధి కోసం అసత్యాలను ప్రచారం చేయడం అత్యంత నీచమైన చర్య అని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటిస్తూ నిజానిజాలను నిర్ధారించిన తర్వాతే వార్తలను ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు సూచించారు.ప్రజా ప్రతినిధులపై నిరాధార ఆరోపణలు,అసత్య కథనాల ప్రసారం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి ప్రచారాలను ప్రజలు విశ్వసించరని వంగ వెంకట్ అన్నారు.వాస్తవాలే ఎప్పటికీ గెలుస్తాయని, అసత్య ప్రచారాలు ఎక్కువకాలం నిలవవని ఆయన పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ