తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా సంబరాల్లో భాగంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ వేడుకలను ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పరిషత్, జిల్లా సహకార శాఖ మరియు ఏడి మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం పూలతో, రంగవల్లులతో కళకళలాడింది. సాంప్రదాయ వాతావరణంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మలను అలంకరించి సమిష్టిగా పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి హాజరై బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా ఆడిపాడారు. పండుగ సందర్భంగా మహిళా శక్తి, తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక. పూలతో సృష్టించిన ఈ సాంప్రదాయ బతుకమ్మ మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉద్యోగిణులు, సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు.జడ్పీ సీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగలో సాంస్కృతిక, సామాజిక ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరహా వేడుకలు ఉద్యోగులు, అధికారులు మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. పూలతో చేసిన ఈ బతుకమ్మలో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ఉన్న ప్రాధాన్యత కూడా మనకు గుర్తు చేస్తుంది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలతో పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, డిసిఒ రుక్మిణి, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, టీజీవోస్ జిల్లా అధ్యక్షులు వెంకట పుల్లయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ