తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 20న ఎయిర్ పోర్టు స్థల పరిశీలన కోసం రావాల్సిన కేంద్రబృందం 23వ తేదీన పర్యటిస్తుందని మంత్రి తుమ్మల తెలియచేశారు. నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చరవాణిలో కేంద్ర బృంద పర్యటన కోసం చర్యలు తీసుకోవాలని కోరగా, ఈ నెల 23న జిల్లాకి బృందాన్ని పంపించేల చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ బృందం పాల్వంచ కొత్తగూడెం ప్రాంతాలలో పర్యటిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్తగూడెం పాల్వంచ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పలు భూములు గుర్తించామని అక్కడ సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. అంతేకాకుండా ఈ సర్వే కోసం నిధులు కూడా మంజూరయ్యాయని (జీవో నెం.5, తేది:04.01.2025 జతచేయడమైనది), అలాగే జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి పలు అనువైన ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల సాధ్యాసాధ్యాలు నిర్ధారించేలా సర్వే వెంటనే చేపట్టాలని కోరారు. 23న ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటన...మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు 6గురు సభ్యుల ప్రత్యేక బృందం వస్తున్నట్లు వెల్లడించారు. ఈ బృందంలో ఏరో ప్లానింగ్ ఇంజనీర్ అబ్దుల్ అజీజ్, అర్క్ టెక్ మహ్మద్ సఖీబ్, ఆపరేషన్స్ ఇంజనీర్ ప్రశాంత్ గుప్తా, సి.ఎన్.ఎస్ ఆర్. దివాకర్, ఇంజనీర్ మనీష్ జోన్వాల్, ఎఫ్.పి.డి ప్రవీణ్ ఉన్ని కృష్ణన్ వస్తున్నట్టు తెలిపారు. ఈ బృందం పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడాలని, వారు కోరిన రెవిన్యూ డిపార్ట్ మెంట్ (భూ సేకరణ), ఫారెస్ట్, వాటర్ రిసోర్సెస్ మరియు ఏవియేషన్ బృందాన్ని వారికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని మంత్రి తుమ్మల ఆదేశించారు. వారి పర్యటనలో భాగంగా సదరు బృందానికి వారు కోరిన సమాచారం ఇచ్చేలా సంబంధిత విభాగాలు సిద్ధంగా ఉండాలని, వారి పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేయాలని కోరారు. విమానాశ్రయం తో రూపురేఖలు మారనున్న కొత్తగూడెం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో కొత్తగూడెం పాల్వంచ ప్రాంతాల రూపు రేఖలు మారుతాయన్నారు. వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా, పారిశ్రామికపరంగా జిల్లా అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందన్నారు. దక్షిణయోధ్యగా పేరొందిన భద్రాచలం ప్రాంతానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు సైతం వచ్చేందుకు ఈ విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు...జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం సహకరిస్తున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రివర్యులు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ