తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.యాజమాన్యం అడ్డంకులను ప్రభుత్వం తొలగించాలి. గతంలో మాదిరిగానే నిర్మాణ వెసులుబాటు కల్పించాలి. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య.జీవో 76 ద్వారా సింగరేణి ప్రాంతాల్లో నివాసముండే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే క్షేత్రస్థాయిలో పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. రామవరంలో బుధవారం జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం స్థలాల్లో నిర్మాణాలకు అంగీకరించని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు, సింగరేణి పరిధిలో ఆటంకాలు లేకుండా పేదలు ఇండ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం కొత్తగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలైన రామవరం, గౌతంపూర్, రుద్రంపూర్, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, బర్మా క్యాంపు తదితర ఏరియాలు, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వారిలో అత్యధికులు ప్రస్తుత, మాజీ సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు మరియు సంస్థపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలేనని ఆయన వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసినా యాజమాన్యం ఆంక్షల వల్ల పేదలు గూడు నిర్మించుకోలేని గందరగోళ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని, సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పేదలకు సొంతింటి నిర్మాణానికి ఆటంకాలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లేనిపక్షంలో సింగరేణి పేదల పక్షాన నిలిచి దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు గోపికృష్ణ, తూముల శ్రీను, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ