తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? హామీలు అమలుచేయకుంటే సమ్మె పోరాటం తప్పదు ???? ఇచ్చిన గడువులోపు 13 సమ్మె డిమాండ్లు పరిష్కరించాలి ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే హైదరాబాద్లో రవాణా కమిషనర్తో చర్చలు జరిపినట్లు ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య తెలిపారు. జేఏసీ చర్చలు సఫలమైన సందర్భంగా ఏఐటీయూసీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం పట్టణంలో కార్మికులు ఆటోలతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, ఎంజీ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్కు చేరుకుంది. అనంతరం జరిగిన సభలో కంచర్ల జమలయ్య మాట్లాడారు. సమ్మె నోటీసులోని 13 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి కార్మికుడికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుందని స్పష్టం చేశారు. రవాణా రంగ కార్మికులకు భరోసా కల్పించేలా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చారని చెప్పారు. పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలో టాడు నాయకులు ధర్మపురి నరేష్, టిఆర్ఎస్ నాయకులు వీరన్న, బిఎంఎస్ నాయకులు బండారి యాదగిరి, బత్తుల సత్యనారాయణ, మర్రి కృష్ణ, ఆరెళ్లి కృష్ణ, బడుగు భాస్కర్, బాబా, రాంబాబు, షాకీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ