తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. జీరో క్యాజువాలిటీస్ లక్ష్యంగా సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్రంలోని వర్ష పరిస్థితులు, వరద నివారణ చర్యలు, ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో 24×7 కంట్రోల్ రూమ్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించి అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా చూడాలని, కూలిపోయే ప్రమాదం ఉన్న పాత భవనాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీసు శాఖతో సమన్వయంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ "జీరో క్యాజువాలిటీస్" లక్ష్యంగా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు.రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వెంటనే సహాయక చర్యలకు వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయం నుండి వీడియో కాన్ఫిడెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాకు కేటాయించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం కొనసాగిస్తూ అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జిల్లాలోని గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు, నదుల పరివాహక ప్రాంతాలు, వాగులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖల సిబ్బందిని మోహరించి ప్రజలు నీటి ప్రవాహాల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచి తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించేలా అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 24 గంటల కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిఆర్ఓ పద్మావతి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి అనూష, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ