తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధాన మంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (PM-JUGA) పథకం కింద మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల, ఆదాయ వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారులను బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కమిటీ సమక్షంలో లాటరీ విధానాన్ని అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ అర్హులైన ప్రతి మత్స్యకారుడు ప్రభుత్వ సహాయాన్ని పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి జి. శివ ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ద్విచక్ర వాహనాల కోసం 274 మంది మత్స్యకారులు, మూడు చక్రాల వాహనాల కోసం 26 మంది మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మత్స్యశాఖ డైరెక్టర్, హైదరాబాద్ కార్యాలయం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 51 ద్విచక్ర వాహనాలు, 12 మూడు చక్రాల వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. కేటాయించిన వాహనాల సంఖ్య కంటే దరఖాస్తులు అధికంగా రావడంతో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన PMMSY జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియను కమిటీ సభ్యులు, జిల్లా మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారుల సమక్షంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వాహనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్, డీఆర్డీఓ ఎం. విద్యా చందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి. నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కె. మహేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వి. రామిరెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, జిల్లా మత్స్యశాఖ అధికారి జి. శివ ప్రసాద్ (కన్వీనర్), ప్రగతిశీల మత్స్యకారుడు పిట్టల సాయిలు, జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ