తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.దోపిడీ పాలనపై ఉద్యమాలకు కదలిరావాలి.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటి దోపిడీ విధానాలపై రాజీలేని ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా బుధవారం సిపిఐ రామవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామవరం సెంటర్లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య గడీల అరాచకాలను ఎదిరించి కమ్యూనిస్టుల నాయకత్వంలో పేద ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనదని కొనియాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రాణాలర్పించిన నాలుగు వేల మంది అమరుల ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలన్నారు. నేటి పాలకులు ప్రజాసంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ పేద, మధ్యతరగతి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఏకం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, ఎస్ కె ఫహీమ్ దాదా, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, ఏరియా నాయకులు మర్రి గోపి, తూముల శ్రీనివాస్, మండల రాజేశ్వరరావు, పెయ్యల రంగారావు, నగేష్, సింగిరాల రమేష్, అంకూస్, కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, సర్పంచ్ వాడే రాములు, మాటేటి గోపాల్, డబ్బేటి గురుమూర్తి, ఖయూమ్, బరిగెల భూపేష్, గుత్తుల శ్రీనివాస్, అల్లకొండ సాయిలు, సురీంనేని రామారావు, తొగరు నరేందర్, జలీల్, శంకర్, ఈశ్వరయ్య, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ