తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలు లో భాగంగా గ్రామ సభలను విజయవంతగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సభల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి శాఖ తమకు సంబంధించిన పథకాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని చెప్పారు.సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి గర్భిణులు, చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.విద్యాశాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, వ్యవసాయ శాఖ రైతులకు లాభదాయక పంటలు, ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపడం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సభలకు సమయానికి హాజరై స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ