తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు నర్సరీ ఆవరణలో ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై, ముఖ్యంగా బయోచార్ వినియోగంపై మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురం కైలాస్ అఖరే ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలో విస్తారంగా లభ్యమయ్యే పత్తి కట్టెలు, మొక్కజొన్న చొప్ప వంటి పంట వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో బయోచార్ తయారు చేసే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఇనుముతో తయారుచేసిన పరికరంలో పంట అవశేషాలను నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద కాల్చి నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి చేసే విధానాన్ని నిపుణులు వివరించారు.అనంతరం తయారైన బయోచార్ను గోమూత్రం, ఆవు పేడ మిశ్రమంలో 15 రోజుల పాటు ఉంచి సక్రియం (యాక్టివేషన్) చేసి ఎరువుగా వినియోగించే విధానాన్ని వివరించారు. ఈ విధానం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూమి సారవంతత మెరుగుపడటంతో పాటు తేమ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు సాగు అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం రైతులు పత్తి కట్టెలు, మొక్కజొన్న చొప్పను పొలాల్లోనే కాల్చడం వల్ల నేలలోని విలువైన సూక్ష్మజీవులు పూర్తిగా నాశనం అవుతున్నాయని, దీంతో పాటు సేంద్రియ పదార్థం దగ్ధమై భూమి సారవంతత గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన హానిని కలిగిస్తోందన్నారు. ఇకపై ఏ రైతు పత్తి కట్టెను పొలాల్లో కాల్చకుండా బయోచార్ తయారీకి ఉపయోగించాలన్నారు.బయోచార్లో ఉన్న సూక్ష్మ రంధ్రాల కారణంగా పంటలకు నీరు పెట్టిన సమయంలో యూరియా తదితర పోషక ఎరువులు వృథా కాకుండా అందులోనే నిల్వ ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ పోషకాలు నెమ్మదిగా పంటలకు అందడంతో అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. బయోచార్ను నేల తల్లికి అర్పించినట్లయితే, నేల తల్లి మనకు మెరుగైన ఫలితాలను అందిస్తుందని కలెక్టర్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ విధానాన్ని రైతులు విస్తృతంగా అమలు చేయాలని సూచించారు.అదేవిధంగా బయోచార్ వినియోగం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా డ్రైనేజీలు, పౌల్ట్రీ షెడ్లు, పశువుల శాలలు, చెత్త నిల్వ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చని తెలిపారు. దీని వల్ల దుర్వాసనలు తగ్గి గాలి పరిశుభ్రమవడంతో పాటు జీవన వాతావరణం మెరుగుపడుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి కూడా బయోచార్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బయోచార్ను పెద్ద ఎత్తున తయారు చేసి వినియోగించేందుకు రైతులు, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు, పంచాయతీ సమన్వయంతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో బయోచార్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విధంగా బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం పెరగడంతో పాటు జిల్లాలో సుస్థిరమైన, పర్యావరణహిత వ్యవసాయ విధానాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గ్రామ సర్పంచ్ వాడే రాములు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ, ఎన్ఎస్ఎస్ అధికారులు వేముల కామేశ్వరరావు, శ్రీదేవి, ఎన్సిసి ఇంచార్జ్ ధర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్,రాంబాబు, బూర్గంపాడు, టేకులపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, దుమ్ముగూడెం, జూలూరుపాడు, గుండాల మండలాల ఎంపీడీవోలు అధ్యాపకులు రాజ్ కుమార్ సూపర్డెంట్ విజయ్ ప్రసాద్, వార్డు మెంబర్లు,విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ