తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు మండలంలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని గ్రామసభకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాల క్రితం గ్రామాల్లో సరైన రహదారులు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేకపోయినా నేడు ప్రతి గ్రామంలో రహదారులు, తాగునీటి సదుపాయాలు, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంతో మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు . ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 6 నుండి ప్రారంభమైన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి విధానాలను పాటిస్తూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను వినియోగించాలని కోరారు. గత సీజన్లో రైతులకు ఇబ్బందులు కలిగించిన పీఆర్-126 వరి రకాన్ని సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, పంటల వైవిధ్యీకరణ ద్వారా అధిక దిగుబడులు, ఆదాయం సాధించవచ్చని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, ఆయిల్ బాల్స్ వినియోగం, నిల్వ నీరు తొలగింపు వంటి చర్యలు చేపట్టి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని, అర్హత కలిగిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి అర్హులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ప్రీ-ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిందని, అన్నపురెడ్డిపల్లి మండలానికి మూడు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంటింటికి వచ్చే బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలు) సరైన వివరాలు అందించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ సభకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వర్ణ, ఎంపిడిఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష ఇతర మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ