తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పొట్టకొడుతుందని, ప్రజలపక్షాన ఉద్యమాల ఉదృతిని పెంచి పాలకులకు కళ్ళు తెరిపిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారాలు మోపడం దుర్మార్గమన్నారు. పెంచిన ఇంధన, గ్యాస్ ధరలతో పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర సర్కార్, ధనవంతులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై రాజీలేని పోరాటాలు చేస్తామని, తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రతిఘటన ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె సారయ్య, మున్నా లక్ష్మి కుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి పూర్ణచందర్ రావు, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు రాహుల్, ఎస్ కె ఫహీమ్, మండలాల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ