తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దరఖాస్తు చేసుకున్న చాలామంది లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేకపోవడం రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పదో వార్డులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రేషన్ కార్డుల లబ్ధిదారుల పరిశీలన జాబితాను దేని ఆధారంగా తయారు చేశారో అర్థం కాని అయోమయ స్థితిలో ఆ జాబితా ఉన్నదని ఆయన అన్నారు. అనేకమంది రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లోను, కలెక్టర్ ఆఫీస్ లో, తాసిల్దార్ ఆఫీసుల్లో, ప్రజా పాలనలో దరఖాస్తు చేశారని వీటిలో చాలామంది పేర్లు ఈ జాబితాలో లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత అనేక సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ కాలేదని, ఇప్పుడైనా రేషన్ కార్డులు వస్తాయని సంతోషించిన ప్రజలకు ఈ జాబితాను చూడటంతో ఇప్పుడు కూడా రేషన్ కార్డులు రాకపోతే ఇక రేషన్ కార్డు రావడం కష్టమేనని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, చిన్న పిల్లల పేర్లు, పెళ్లయి వచ్చిన కోడల పేర్లు చేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కుటుంబ సర్వే కులగననలో రేషన్ కార్డు లేదని సర్వేలో రాయించుకున్న వారి పేర్లు కూడా అనేకమందివి రాలేదని దీన్ని బట్టి చూస్తే ఏ ఆధారంగా లబ్ధిదారుల పరిశీలన జాబితా తయారు చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇట్టి సమస్యలను కౌన్సిలర్స్ ద్వారా తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ నిబంధనను సడలించి వారికి నూతన కార్డులు మంజూరు చేయాలని, అలాగే ఎవరి పేర్లు అయితే జాబితాలో రాలేదొ అర్హత కలిగిన వారి నుండి నూతన దరఖాస్తులు తీసుకొని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించినట్లు మునిగడప తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు ముద్దం మార్తమ్మ, బి జాన్ బి ,శకుంతల, ముంతాజ్, నూరి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ