తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో వారాంతపు సంతను కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వ్యాపారుల నుంచి టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నప్పటికీ, సంత నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంత నిర్వహించే ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపాటి వర్షం కురిసినా ఈ ప్రాంతం మొత్తం మురుగునీటితో నిండిపోయి, అపరిశుభ్రతకు నిలయంగా మారుతోందని అన్నారు. వ్యాపారులు మురుగునీటి మధ్యలోనే తమ సరుకులను ఏర్పాటు చేసుకుని విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా, ప్రస్తుతం సంతను నేషనల్ హైవేకు ఇరువైపులా నిర్వహించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు, పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత, వ్యాపారుల సౌకర్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, వారాంతపు సంతకు సురక్షితమైన, అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జాటోత్ వెంకన్న నాయక్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ