తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని స్థానిక కొత్తగూడెం క్లబ్ లోని ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది స్థానికులు పాల్గొన్నారు.ముందుగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కొత్తగూడెంలో ట్రాఫిక్ సమస్యను,పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో పోలీసు వారు చేపట్టే కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు.అదే విధంగా జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమ,నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమైన ప్రదేశాలలో చేయవల్సిన మార్పుల గురించి,ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నిరంతర పనితీరు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి వివరించారు. అదేవిధంగా జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండి జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.కొత్తగూడెం పట్టణ వ్యాప్తంగా నూతనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని అన్నారు.వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు మరియు పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ వారి సూచనలను పాటించాలని అన్నారు.అన్ని శాఖల వారు సమిష్టిగా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.అనంతరం జాతి రోడ్డు భద్రత మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ