తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టాం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి 1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి ముందుగా మంగయ్య బంజార గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో మంగయ్య బంజారు–గానుగపాడు రహదారిపై గ్రావెల్ రోడ్డు, కల్వర్టు నిర్మాణం, ఇల్లంగి బాబు ఇంటి నుండి కాజ్వే వరకు సీసీ రోడ్డు, కాజ్వే నుండి గానుగపాడు రహదారి వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి 24 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. అనంతరం పొకలగూడెం గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. యాసం లక్ష్మి ఇంటి నుండి మలిశెట్టి జానకమ్మ, కందికొండ కుమారి ఇంటి వరకు, బానోతు నరసింహ ఇంటి నుండి ఇస్లావత్ రాందాస్, గుగులోతు మంగిత్య ఇంటి వరకు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి పెండయ్య ఇంటి మీదుగా పద్దం రాముడు ఇంటి వరకు, గోపు చంద్రయ్య ఇంటి నుండి వాటర్ ట్యాంక్ వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామంలో మిగిలిన అంతర్గత రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తదుపరి రావికంపాడు గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో రాచర్ల వెంకటేశ్వర్లు ఇంటి నుండి యూపీ పాఠశాల వరకు, అనుముల ముత్తయ్య ఇంటి నుండి శ్రీరాములు రామారావు ఇంటి వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పులతో వదిలి వెళ్లినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ఇటీవల మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక భద్రతా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహాల పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల గృహాలు, రెండో విడతలో మరో 2.50 లక్షల గృహాలు మంజూరు చేసి మొత్తం 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా లక్ష ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఒక్క పేద కుటుంబం కూడా పూరి గుడిసెలో నివసించకుండా ప్రతి అర్హ కుటుంబానికి శాశ్వత గృహాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, కల్వర్టులు, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చండ్రుగొండ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ , గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మంగయ్య బంజార గ్రామం మొదటగా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యిందని తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, గృహ నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో చండ్రుగొండ మండలానికి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరవుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని పనులను కూడా చేపడతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ గృహాల కోసం పూరి గుడిసెల సర్వే పూర్తయిందని తెలిపారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం "ఫ్రైడే–డ్రై డే" కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, దోమల నివారణ, తాగునీటి పరిశుభ్రత, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పనకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, పంచాయతీ అధికారి అనూష, గృహ నిర్మాణ శాఖ పిడి,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ