తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మరణించిన, వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాల ధృవీకరణకు సహకరించాలి.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న (షిఫ్ట్ అయిన) ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమం పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగించడంతో అదనపు సమయం లభించిందని, ఆ సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని మిగిలిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పురోగతిని వివరిస్తూ, మొత్తం 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి 8,60,051 ఎన్యూమరేషన్ ఫారాలు (86.33 శాతం) డిజిటైజ్ కాగా, 1,29,263 ఫారాలు (12.98 శాతం) అన్-కలెక్టబుల్గా నమోదయ్యాయని తెలిపారు. దీంతో డిజిటైజ్ చేసిన ఫారాలు, అన్-కలెక్టబుల్ ఫారాలు కలిపి మొత్తం 9,89,314 ఫారాల ప్రక్రియ పూర్తై జిల్లా 99.31 శాతం పురోగతి సాధించిందన్నారు. ప్రస్తుతం కేవలం 6,884 ఫారాలు (0.69 శాతం) మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ల వివరాలు నేరుగా ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాలో చేరుతాయని తెలిపారు. ఆన్మ్యాప్డ్ కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, నివాసాన్ని మార్చుకున్న ఓటర్ల వివరాలను ధృవీకరించి సంబంధిత ఆధారాలతో ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఏఎస్డీ, డీఎస్ఈ జాబితాలను మరోసారి పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా లోపాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగిందో లేదో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించాలని, అవసరమైతే రీ-వెరిఫికేషన్ నిర్వహించి లోపాలను సరిదిద్దేందుకు సహకరించాలని కోరారు.పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, రీ-అరేంజ్మెంట్ ప్రక్రియను కూడా గడువులోగా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలకు బదులుగా కొత్త భవనాలు అందుబాటులో ఉంటే వెంటనే సమాచారం అందించాలని, పాఠశాల పేరు లేదా భవనం మారిన సందర్భాల్లో సంబంధిత ప్రతిపాదనలు పంపాలని కోరారు. అలాగే 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు లేదా జనాభా మార్పులు అధికంగా ఉన్న ప్రాంతాలను రేషనలైజేషన్ కోసం ప్రతిపాదించాలని సూచించారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్వోలు ఇంటింటి సందర్శనలు నిర్వహించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తుండగా, ఆగస్టు 10లోగా పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు, అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలపై విచారణ, పరిష్కార ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్కు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేసి, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్,కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరెడ్డి, బిజెపి అండ్ కృష్ణ, శివ, ఆమ్ ఆద్మీ పార్టీ రాంబాబు, సిపిఐ బాలరాజు ఇతర గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ