తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు ఐటీఐ–ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు అభినందనీయం. 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు .అత్యుత్తమ ఆవిష్కరణలకు అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు. పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్గా అభివృద్ధికి సహకారం. త్వరలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువ రైతుల కోసం వ్యవసాయ కోర్సులు. టాటా సంస్థ ద్వారా 100 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. టామ్కామ్ ద్వారా జర్మనీ, జపాన్లో ఉద్యోగ అవకాశాలకు చర్యలు. ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు. విద్యార్థులు స్కాలర్షిప్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులు మరియు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ముందుగా విద్యార్థులు రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులు పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పరిశీలించి, పాత వాహనాల నుంచి విడిభాగాలను సేకరించి వాటిని పునర్వినియోగం చేస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను ఏ విధంగా రూపొందించారు, తయారీలో ఉపయోగించిన సాంకేతిక విధానం, వాహనాల పనితీరు తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఐటీఐ–ఏటీసీ విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా రూపొందించిన వివిధ నూతన పరికరాలను కూడా మంత్రి పరిశీలించి విద్యార్థులను అభినందించారు.మణుగూరు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన విద్యార్థులు తమ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్రంలోని ఇతర ఐటీఐ–ఏటీసీ విద్యార్థులకు రోల్ మోడల్గా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసి కమర్షియల్ వెహికల్స్గా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్థుల ఆవిష్కరణలు కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా మార్కెట్లో ఉపయోగపడే ఉత్పత్తులుగా రూపుదిద్దుకునేలా పరిశ్రమల సహకారంతో అవసరమైన అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను టాటా సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. టాటా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ సాంకేతిక కేంద్రాల అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. పాత ఐటీఐల్లో కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పాటు పరిశ్రమలకు ప్రస్తుతం అవసరమైన ఆధునిక సాంకేతిక కోర్సులను ఏటీసీల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు టాటా సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు.రాష్ట్రంలోని 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అత్యుత్తమ ఆవిష్కరణలు చేసే విద్యార్థులను గుర్తించి రాష్ట్రస్థాయిలో పోటీ నిర్వహిస్తామని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మణుగూరు విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు ఇలాంటి ఇన్నోవేషన్కు మంచి ఉదాహరణ అని అన్నారు.త్వరలోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువత, యువ రైతుల కోసం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. మంచి నైపుణ్యాలు కలిగి ఉంటే దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. ఉద్యోగాల కోసం తమ ప్రాంతానికే పరిమితం కాకుండా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లి పనిచేసే స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలని సూచించారువిదేశాల్లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించి జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం టామ్కామ్కు రూ.90 కోట్లు కేటాయించిందని తెలిపారు. జర్మనీ పర్యటన సందర్భంగా అక్కడి ప్రతినిధులతో చర్చలు జరిపినప్పుడు తెలంగాణ నుంచి శిక్షణ పొందిన యువతను పంపిస్తే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వారు ముందుకు వచ్చినట్లు చెప్పారు.విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్లు, విద్యార్థి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిందని, ఇప్పటివరకు సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఉపాధ్యాయులు, నర్సులు, సింగరేణి, ఇతర ప్రభుత్వ సంస్థల్లో చేపట్టిన నియామకాలను కలిపి సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మరో లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఐటీఐ ఉత్తీర్ణులైన సుమారు 100 మంది యువతకు జర్మన్ భాషలో శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే వారు A1, A2 స్థాయిలను పూర్తి చేశారని, తదుపరి B1, B2 స్థాయిలను పూర్తి చేసిన అనంతరం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. మణుగూరు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నైపుణ్య, విదేశీ భాషా శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మణుగూరు ప్రాంతంలో ఐటీసీ సంస్థతో సమన్వయం చేసుకుని సీఎస్ఆర్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. సుమారు 100 మంది యువతకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మణుగూరు వంటి ఆదివాసీ ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీసీ ఏర్పాటు కావడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. జపనీస్ వంటి విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఏటీసీ విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను అభినందించిన ఆయన, విద్యార్థుల సృజనాత్మకతను మరింత ప్రోత్సహించాలని కోరారు. ఐటీఐల్లో చదువుతున్న గిరిజన, పేద, కార్మిక కుటుంబాల పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం ప్రధానంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతంలో గిరిజనులు, దళితులు, బీసీలు, పేద, బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా ఉన్నారని చెప్పారు. మణుగూరులో సింగరేణి బొగ్గు గనులు, బీటీపీఎస్, అశ్వాపురంలోని భారజల కర్మాగారం, బూర్గంపాడులో ఐటీసీ పేపర్ బోర్డు, పాల్వంచలో నవభారత్, కేటీపీఎస్ వంటి పరిశ్రమలు ఉన్నందున స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తే విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.మణుగూరు ఏటీసీలో 244 మంది, ఐటీఐలో 168 మంది, మొత్తం 412 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఏటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందన పత్రాలు అందజేశారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు మణుగూరు ఐటీఐ–ఏటీసీ వద్ద రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మణుగూరు ప్రాంతం సుమారు 80 శాతం ఏజెన్సీ, షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉందన్నారు. అదే సమయంలో సింగరేణి, నవభారత్, ఐటీసీ వంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నందున పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్ సంప్రదాయ కోర్సులతో పాటు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, CNC వంటి ఆధునిక సాంకేతిక కోర్సులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలతో సమన్వయం చేసుకుని ప్లేస్మెంట్ అవకాశాలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలను అనుసంధానం చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ సెంటర్స్ జాయింట్ డైరెక్టర్ నగేష్, టాంకం ఈవో గౌస్ పాషా, రతన్ టాటా ఆర్డిడి కోటేశ్వరరావు, ఏ టి సి కళాశాల ప్రిన్సిపాల్ సారంగపాణి, తహసిల్దార్ అద్దంకి నరేష్ మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు-
Admin
తెలుగు వెలుగు టీవీ