తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం.భూమి కోసం సాగిన సాయుధ పోరు అజరామరం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య.వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, బిసి సంఘం జిల్లా నాయకులు నేరెళ్ల రమేష్ కొనియాడారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో గురువారం సంస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన మహత్తర రైతాంగ పోరాటంలో ఎర్రజెండా అండతో ఐలమ్మ చేసిన ప్రతిఘటన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ తుపాకీ పట్టి నిజాం నిరంకుశ పాలనపై గర్జించారని గుర్తుచేశారు. దొరల గడీల అహంకారాన్ని మట్టికరిపించిన ఆమె తెగువ అపూర్వమని, పాలకుల దౌర్జన్యాలను ఎదిరించిన ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భూక్యా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు కె రత్నకుమారి, రేసు ఎల్లయ్య, బోయిన విజయ్ కుమార్, దుర్గయ్య, నల్లా శ్రీనివాస్, కైసర్, గడ్డం సతీష్, రాజు, సర్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ