తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 20న టేకులపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధమ మహాసభ ను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎదలాపురం గోపాలరావు,తెలంగాణ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాయల సిద్దు కోరారు.జూలూరుపాడు మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో జిల్లాలో ఆటో & మోటార్ కార్మికుల పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా తయారయిందని,రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికులు కిరాయిలు లేక నేడు ఆటో అడ్డాలపై దీన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా కార్మిక వర్గాన్ని వంచించే ప్రభుత్వాలేనని నేడు అర్ధం అవుతున్నదని,ఉచిత హామీలతో ఊదరగొడుతూ, అబద్ధాలతో పాలన చేస్తూ, ఓట్లను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని దివాలా తీయించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.2023 డిసెంబర్లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని,ఇది తెలంగాణలోని మహిళలకు ఒక వరమైంది కానీ ఆటో, క్యాబ్, జీప్, మ్యాజిక్ డ్రైవర్లకు మాత్రం శాపంగా మారిందని అన్నారు.ఆటోలో ఎక్కే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం వలన ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయిందని,బతుకులపై భరోసా తగ్గిందని,ఈ క్రమంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలైన మోటర్ కార్మికులకు సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల ఐక్యంగా ఉద్యమించాలని, ఈ నేపథ్యంలో జరుగుతున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు నేలాల నవీన్, కత్తి సాయి, నేలాల సీతారాములు, నూక పోగు రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ