తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజల్లో గందరగోళం సృష్టించేలా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అధికార యంత్రాంగం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉందని, బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా కొరత లేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్లే ప్రజల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అపోహలకు లోనై అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోందని వివరించారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, మళ్లించడం, బ్లాక్ మార్కెట్కు పాల్పడడం వంటి చర్యలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇటువంటి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశించారు.రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకొకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అపోహలు నమ్మకుండా ప్రభుత్వం గ్యాస్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. [7:02 pm, 13/3/2026] SIR: బ్రేకింగ్ వెబ్
Admin
తెలుగు వెలుగు టీవీ