తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ఎంపీడీవోలు,తహసిల్దారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికలకు కేటాయించిన సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల విషయంలో స్థానికంగా పడిన గుంతలను పూడ్చాలని, అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని దీని విషయంలో పంచాయతీరాజ్ అధికారులు అంచనాలను రూపొందించాలన్నారు.భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు,సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా తొలగించాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే గ్రామాల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలన్నారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ పనులను చేపట్టి బ్లీచింగ్ పౌడర్ ను చల్లించాలన్నారు. గ్రామాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలతో పాటు ప్రధాన రహదారులకు పక్కన ఇంకుడు గుంతలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరో నాలుగైదు రోజులు వర్ష సూచన ఉన్నందున ముంపు ప్రాంతాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అటు గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ముంపు ప్రాంత మండలాల అధికారులు గర్భిణీ స్త్రీలు, వృద్ధులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని గమనిస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పునరావస కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు, పూర్తిగా దంసమైన ఇళ్లకు, చనిపోయిన పశువులకు,గేదెలకు ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం నష్టపరిహాన్ని బాధితులకు అందజేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,డీఆర్డీఓ విద్యా చందన, సిపిఓ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ డాకుసింగ్, డిసిహెచ్ రవిబాబు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, డిపిఓ చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.....
Admin
తెలుగు వెలుగు టీవీ