తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి వరదలపై అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం నేపథ్యంలో ముందస్తు చర్యలు ముమ్మరం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, శుక్రవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోదావరిలో నీటి ప్రవాహం నిరంతరం పెరుగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అవసరమైతే మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి అవసరమైతే ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి తదితర అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.గోదావరి స్నాన ఘాట్లు, పర్యాటక ప్రాంతాలు, నది తీర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు నదిలోకి వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ నిరంతర బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహం తగ్గే వరకు నదిలో చేపల వేట, పడవల రాకపోకలు, అనవసరంగా నది వద్దకు వెళ్లడాన్ని నియంత్రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించాలని, వరద పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా నియంత్రణ కేంద్రానికి అందించాలని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.సాయంత్రం 6.00 గంటల నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.40 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43.00 అడుగులు కాగా, ఆ సమయంలో సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ