తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో సూచించారు. నాణ్యమైన నారు మంచి దిగుబడులకు, అధిక లాభాలకు పునాది అని తెలిపారు.ఒక ఎకరానికి నాట్లు వేయడానికి సుమారు 4 సెంట్ల భూమిని నారుమడిగా సిద్ధం చేయాలని చెప్పారు. భూమిని మెత్తగా దుక్కి చేసి సమతలంగా తయారు చేయాలని సూచించారు. దమ్ము నారుమడి పద్ధతిలో సాగు చేసే రైతులు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి పొలాన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు.విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూట కట్టాలని, ఇలా చేయడం వల్ల విత్తనాలు త్వరగా, సమానంగా మొలకెత్తుతాయని పేర్కొన్నారు. మొలక వచ్చిన విత్తనాలను సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని సూచించారు.నారుమడిలో పలుచగా నీరు నిల్వ ఉండేలా నిర్వహిస్తే నారు ఆరోగ్యంగా పెరిగి, సరైన సమయంలో నాటేందుకు అనుకూలంగా తయారవుతుందని తెలిపారు. నారు దశలో సరైన సంరక్షణ చేపడితే పంట ప్రారంభం నుంచే మంచి ఎదుగుదల ఉండి, దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నారుమడిని సిద్ధం చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు కోరారు. అలాగే పంట ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సాంకేతిక సలహాలను వినియోగించుకోవాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ