తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా మరియు హైపోథలసేమియా నియంత్రణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్టేట్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హైదరాబాద్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలోని డీసీహెచ్ఎస్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్లు మరియు వివిధ కార్యక్రమాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో సికిల్ సెల్ అనీమియా మరియు హైపో థలసేమియా కేసుల గుర్తింపు, నివారణ మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు గర్భిణీ స్త్రీలు మరియు వారి భర్తలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ఇద్దరికీ పాజిటివ్గా తేలినట్లయితే గర్భస్థ శిశువుకు కూడా తగిన పరీక్షలు చేయాలని తెలిపారు. అదేవిధంగా నవజాత శిశువులకు జననం జరిగిన 48 గంటల తర్వాత సికిల్ సెల్ అనీమియా మరియు హైపో థలసేమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని టీచింగ్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో కొత్త కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే భద్రాచలం, పాల్వంచ, ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు మరియు చర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సికిల్ సెల్ అనీమియా, హైపో థలసేమియా స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ పురోగతిని పర్యవేక్షించాలని, అన్ని డెలివరీ పాయింట్లలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు శిక్షణ అందించి వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రతాప్, డాక్టర్ రాకేష్, డాక్టర్ హరీష్, డాక్టర్ దినేష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ