తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5(తెలుగు వెలుగు)జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేయాలి మరియు మండల కేంద్రాలలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు . పత్తి, ధాన్యం అమ్ముతున్న మార్కెట్లలో దళారులు దోపిడీని అరికట్టాలని, పత్తి పంట అధికంగా పండుతున్న మండలాల్లో తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు. గురువారం జూలూరుపాడు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పత్తి పంట చేతికొచ్చి నెలలు దాటుతున్నప్పటికీ సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయటంలో మార్కెటింగ్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అధికంగా పత్తి వండుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఉప మార్కెట్ యార్డును శాశ్వత వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొత్తగూడెం మార్కెట్ కు అనుసంధానంగా సుజాతనగర్ లో కూడా ఉప మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ శాఖ చూడాలని కోరారు. జిల్లాలో ప్రధానంగా జూలూరుపాడు సుజాతనగర్ చంద్రుగొండ టేకులపల్లి గుండాల ఆళ్లపల్లి, పాల్వంచ ములకలపల్లి దమ్మపేట, తదితర మండల కేంద్రాల్లో, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్, చర్ల వ్యవసాయ మార్కెట్,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆయన కోరారు. కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోని నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.రైతులు పండిస్తున్న అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులు మేరకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించిందని, రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని ఆయన ఆరోపించారు. వరి పంట పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించారని, వాటిని తక్షణమే రైతు ఖాతాలో జమ చేయాలని ఆయన కోరారు. ఈ మావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, రాయల సిద్దు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ