తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు నివారణ, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణకు శాఖల వారిగా చేపట్టవలసిన కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. గంజాయి సాగు అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టాలని, రోజువారి తనిఖీ వివరాలను తప్పనిసరిగా నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న వారిని గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్ అందించాలని తెలిపారు. అయినప్పటికీ మాదకద్రవ్యాల వినియోగం కొనసాగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సారా తయారీపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు పోలీస్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. చైతన్యం కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల వినియోగం రక్తదానంపై కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రక్త నిల్వలు తక్కువగా ఉన్న సందర్భాల్లో ముందుగానే సమాచారం అందించడం ద్వారా విస్తృత స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా భద్రాచలం బ్రిడ్జి ప్రాంతం నుండి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. యువత నిరుద్యోగం కారణంగా అడ్డదారులు తొక్కకుండా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా స్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశాన్ని సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో రహదారుల భద్రతపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే సమయంలో కఠినమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రహదారుల భద్రత అవగాహన కోసం ప్రధాన కూడళ్లలో వాలంటీర్లను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన మైకులు, హెల్మెట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన కూడళ్లలో హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై మైకుల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై చార్ట్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ప్రతి పాఠశాలలో రోడ్ సేఫ్టీ కెప్టెన్ను నియమించాలని, ప్రతి వారం ప్రతి ప్రభుత్వ హైస్కూల్లో రహదారుల భద్రతపై ప్రసంగాలు నిర్వహించేలా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలకు అధికంగా లోనయ్యే టాప్–20 ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్లు, హెచ్చరిక సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు అమలులో ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఎన్హెచ్–30 పరిధిలోని రామవరం సమీపంలోని బ్లైండ్ కర్వ్, భద్రాచలం ఆలయ రోడ్డులో పాదచారుల భద్రత, కుకునూరు రోడ్డులో రహదారి పరిస్థితులు మరియు అక్కడ అమలవుతున్న భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అదనపు హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగులు, వెలుతురు సదుపాయాలు, అవసరమైన చోట వేగ నియంత్రణ చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్ కనెక్టివిటీ కోసం రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఎటువంటి వాహనాలు నిలపకుండా కఠిన చర్యలు చేపట్టాలని, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారుల వెంట పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేందుకు అత్యాధునిక పరికరాలు సమకూర్చి అవసరమైన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాల సమయంలో బాధితులను రక్షించేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా గుడ్ సమరిటన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసి ప్రాణాలు కాపాడిన గుడ్ సమరిటన్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశం లో జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఆర్ అండ్ బి డి నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పంచాయతీరాజ్ శ్రీనివాస్,ఇంటర్మిడియట్ అధికారి వెంకటేశ్వర్లు, పోలీస్ శాఖ అధికారులు, వైద్య శాఖాధికారులు, సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ