తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యారంగాన్ని విస్మరిస్తున్న రేవంత్ సర్కార్పై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహం.భద్రాద్రి కొత్తగూడెంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక.తెలంగాణలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. విద్యా సమస్యల పరిష్కారంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా విజయవంతమైంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించగా, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బుర్రి వీరభద్రం, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టబడుతోందని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను విరమించుకుని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10,814 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పాటు రూ.250 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, నూతన జాతీయ విద్యా విధానం–2020కు వ్యతిరేకంగా పార్లమెంట్లో తీర్మానం చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి సంతోష్, గుగులోత్ వీరభద్రం, పీడీఎస్యూ నాయకులు విఘ్నేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ