తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.12 కోట్లతో పోస్టాఫీస్-హేమచంద్రాపురం రోడ్డు పనులు.కూనంనేని చొరవతో రోడ్డు అభివృద్ధి పనులకు మోక్షం.త్వరలో ప్రారంభంకానున్న డబుల్ రోడ్డు నిర్మాణం.సింగరేణి పరిధిలో టెండర్లు పూర్తి.నియోజకవర్గ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి శేషగిరినగర్ మీదుగా హేమచంద్రాపురం వరకు రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ మార్గంలో సింగరేణి భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు తీవ్రంగా ధ్వంసమై, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని సింగరేణి ఉన్నతాధికారులతో ఆయన పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై, పనుల ఆవశ్యకతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన నిరంతర కృషి, పట్టుదలకు సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పనుల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సింగరేణి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని అనుమతులు పూర్తి కావడంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక డబుల్ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా రద్దీ తగ్గడంతో పాటు స్థానిక ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా దుమ్ము, గుంతల సమస్యల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ఎమ్మెల్యే కూనంనేనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోడ్డు నిర్మాణం మరో నిదర్శనంగా నిలుస్తోంది.
Admin
తెలుగు వెలుగు టీవీ