తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు . రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాలలో ప్రతిభ కనబరచి మొత్తం 54 పతకాలు సాధించడం విశేషమని అన్నారు .ఈ సందర్భంగా మంగళవారం ఐడీఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పతక విజేతలను అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. క్రీడాకారులు సాధించిన 15 బంగారు, 19 వెండి, 20 కాంస్య పతకాలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని తెలిపారు. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలోనే 31 పతకాలు సాధించడం జిల్లాలో క్రీడా అభివృద్ధి దిశగా సానుకూల పరిణామమని తెలిపారు .గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన యువ క్రీడాకారులు కూడా సమానంగా ప్రతిభ చాటుకోవడం అభినందనీయమని, క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని కలెక్టర్ అన్నారు . క్రీడలు విద్యతో పాటు సమాన ప్రాధాన్యత పొందాలని, పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. క్రీడాకారుల విజయాలలో కోచ్లు, శిక్షకులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారుల సహకారం ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా జిల్లా క్రీడాకారులు రాణించేలా అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యం. పరంధామ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, కొమరారం వెంకటనారాయణ (ఏఎస్ఓ, ట్రైబల్ వెల్ఫేర్), బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ మట్టపర్తి రమేష్, టైక్వాండో సెక్రటరీ రమేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి, మంజిలాల్ (పీడీ), నాగలక్ష్మి (పీడీ), చైతన్య (పీడీ), వాసు, నాగేందర్, నాగరాజు, మాలికార్జున్, గిరిప్రసాద్, కావేటి రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ