తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూనియర్ కళాశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అడ్మిషన్లు,ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు అవసరం.. జిల్లాలో జూనియర్ కళాశాలల అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.జిల్లాలో జూనియర్ కళాశాలల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, కళాశాలల్లో చేరికలు, ఉత్తీర్ణత శాతం, అవసరమైన మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రిన్సిపాల్లు మరియు ఇంజనీరింగ్ అధికారులతోమంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించగా, తరగతి గదులు, లీకేజీ నివారణ, విద్యుతీకరణ, త్రాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. విద్యుతీకరణ పనులు అన్ని డిజిటల్ తరగతుల నిర్వహణకు అనుగుణంగా చేయాలని సూచించారు.కళాశాలల్లో అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా అశ్వారావుపేట, చర్ల, పినపాక, దుమ్ముగూడెం కళాశాలల్లో చేరికలు తగ్గడానికి గల కారణాలను ప్రిన్సిపాల్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల నాణ్యత, ఉచిత విద్యా వాతావరణం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ విషయాన్ని గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేసే బాధ్యత అందరి మీద ఉందన్నారు. మహిళా సమాఖ్య సభ్యులు, సీసీ కోఆర్డినేటర్లు, ఏటీఎంలు, మహిళా సంఘాల సభ్యులు ద్వారా “చదువుతోనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుంది” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థికి చేరేలా చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.కళాశాలల ప్రిన్సిపాల్లు విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలు, పరీక్షా ఫలితాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్లు కళాశాలలకు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించగా, కలెక్టర్ బస్సు సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా కళాశాలలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ప్రిన్సిపాల్ తమ కళాశాలను అన్ని విభాగాల్లో అభివృద్ధి దిశగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ప్రతి కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలించి, తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలల కారణాలను విశ్లేషించారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.అన్ని జూనియర్ కళాశాలలో 15 రోజుల్లోగా యూడీసీ పోర్టల్, ఎఫ్.ఆర్.ఎస్. రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని, విద్యార్థుల ఆధార్ సవరణలు, నవీకరణల కోసం కళాశాలలో ఆధార్ క్యాంపులు నిర్వహించాలనీ కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ లు, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ మరియు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ