తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధునిక హంగులతో కొత్త బస్టాండ్లు.సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక. ప్రయాణికులకు మెరుగైన వసతులు.నియోజకవర్గ నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నా.త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి.ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న బస్టాండ్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్తో కలిసి ఆయన కొత్తగూడెం బస్టాండ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులను, వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ఉన్నతాధికారులకు కూనంనేని స్వయంగా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన భవన నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) నుంచి తక్షణమే రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్ను నూతనంగా నిర్మించేందుకు మరో రూ.10 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ నిధులు సైతం జోడించి దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఈ రెండు బస్టాండ్లను మోడ్రన్ హంగులతో పునర్నిర్మించేందుకు కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు సకల సదుపాయాలు అందేలా పనుల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ