తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేవాదాయ ధర్మాదాయ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరం ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పాంచాహ్నిక దీక్షాపూర్వకంగా వైభవంగా నిర్వహించారు.ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఆగస్టు 23వ తేదీ ఆదివారం ఐదవ రోజు, చివరి రోజు కార్యక్రమాలు మంగళ వాయిద్యాలతో ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటల నుండి ప్రాతఃకాల యథావిధి అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 10.30 గంటలకు మూర్తుల స్థానములు, గర్తన్యాసం, బీజ, ఓషధి, రత్నన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.25 గంటలకు మూలా నక్షత్ర యుక్త తులా లగ్నంలో యంత్ర, విగ్రహ స్థిర ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు శాంతి కల్యాణం అనంతరం బలిహరణ, ధేను దర్శనం నిర్వహించి, అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలను బ్రహ్మర్షి శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ గారు మరియు వారి బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఐదు రోజులపాటు జరిగిన ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ నిర్మాణ దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవంతో శ్రీ పాండురంగ భజన మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ