తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఇతరులు వేసిన చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం కొరకు ప్రత్యేక లోక్ అదాలత్ వచ్చే నెల 9 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కొత్తగూడెం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈనెల 5 నుండి 19 వరకు ముందస్తు లోక్ అదాలత్ ను జిల్లాలోని అన్ని కోర్టులలో నిర్వహిస్తామన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతు ప్రత్యేక లోక్ అదాలత్ లలో ఇరువర్గాలు కానీ కేసులలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి గానీ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించి మేము కేసు రాజీ పరుచుకుంటామని తెలిపితే న్యాయ సేవా అధికార సంస్థ వారు అందుకు సంబంధించిన కేసు వివరాలు తెలుసుకొంటారన్నారు. వారి కేసు ఏ కోర్టులో ఉన్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు తెప్పించుకొని ఆ కేసులలో ఉన్న ఇరవర్గాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకి పిలిపించి ఇరువర్గాల సమక్షంలో గానీ వారి న్యాయవాదుల సమక్షంలో గానీ లేదా మధ్యవర్తిత్వం నిర్వహించి వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారము కనుగొనేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇరువురి సమక్షంలో రాజీ వివరాలను రాతపూర్వకంగా రాసి ఇరు వర్గాలకి అవార్డు రూపంలో కేసు పూర్తయినట్టుగా అవార్డు కాపీని తక్షణమే అందజేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. పై ప్రత్యేక లోక్ అదాలతులలో ఎవరైనా కక్షిదారులు డబ్బులు పూర్తిగా చెల్లించాటానికి సిద్ధంగా లేకపోయినట్లయితే కేసు వేసిన వ్యక్తిని ఒప్పించి కొన్ని వాయిదాలలో చెక్ అమౌంట్ చెల్లించేలా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మధ్యవర్తులు కృషి చేస్తారన్నారు. కావున చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ లన్ని పైన సూచించిన తేదీలలో సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ