తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ అంకిత్.తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతికి కాళోజీ విశిష్ట సేవలు.కాళోజీ ఆశయాలను భావితరాలకు అందించాలి ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్, కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, సామాజిక చైతన్యానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. కాళోజీ కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ, సాధారణ ప్రజల జీవితాలు, వారి కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించినందుకే ఆయనకు ప్రజాకవి అనే బిరుదు లభించిందని అన్నారు.కాళోజీ రచనలు ప్రజల్లో ధైర్యాన్ని, సామాజిక అవగాహనను, చైతన్యాన్ని పెంపొందించాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తన కవిత్వం ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చి మార్పు కోసం కృషి చేశారని గుర్తుచేశారు. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై తన రచనల ద్వారా గళమెత్తిన కాళోజీ ఆలోచనలు నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు.కాళోజీ నారాయణరావు సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ భాష, సాహిత్యం, సంప్రదాయాలు, సంస్కృతిపై ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత కాళోజీ రచనలు, ఆయన జీవితం, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ భాషా వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, కాళోజీ చూపిన ప్రజా చైతన్య మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మావతి, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, సీపీఓ సునీత, ఓఎస్డీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ