తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి.ప్రజాసేవకు, సమస్యల పరిస్కారానికి కార్పొరేటర్లు అంకితం కావాలి.బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్టను పెంచాలి.బస్తీల వారీగా స్థానిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలి.ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలి.అధిక ధరలకు నిరసనగా ఈనెల 10న జరిగే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిపిఐ పక్ష కార్పొరేటర్ల సమావేశం కొత్తగూడెం శాసనసభ సభ్యుల వారి కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సిపిఐ పక్ష కార్పొరేటర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పౌర సేవలు అందించాలని సూచించారు. రాబోయే కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేస్తూ, ప్రజాసమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలన్నారు. పట్టణంలోని ప్రతి వార్డు పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలను గుర్తించి వాటి తక్షణ పరిష్కారానికి మున్సిపల్ అధికారులతో కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్యులపై భారం పడుతోందని, నిత్యావసర వస్తువుల అధిక ధరలకు నిరసనగా ఈనెల 10వ తేదీన చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ