తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెదురు ఆధారిత ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలను పెంపొందించాలి.ఐడిఓసీలో ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు.ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా పాల్గొని వెదురు పెంపకం, పర్యావరణ పరిరక్షణ, వెదురు ఆధారిత ఉత్పత్తుల ప్రాధాన్యతపై మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు వేగంగా పెరిగే సహజ వనరు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే మొక్క అని తెలిపారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నేలకోతను నియంత్రించవచ్చని అన్నారు . ప్రకృతి వనరులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వెదురు వంటి ఉపయోగకరమైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వెదురును ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్, కాగితం, హస్తకళలు, అలంకరణ వస్తువులు తదితర అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వెదురు ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కళాకారులు, చేతివృత్తిదారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికత, డిజైన్లను జోడించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.వెనుకబడిన తరగతులకు చెందిన కళాకారులు, చేతివృత్తిదారులను వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీ వైపు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వెదురు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్పై అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా వెదురు ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని విజయలక్ష్మి ,మేదరి కుల సంఘ నాయకులు కొంటు శ్రీనివాస్, స్వరూప,సిందూజ,కళావతి, రమాదేవి, పిల్లి శీను, సోమయ్య, బొల్లం శ్రీనివాస్, ప్రవల్లిక, కళాకారులు, చేతివృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ