తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, వచ్చే రెండు నెలల్లో కనీసం 60 శాతం రికవరీ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశంలో స్త్రీ నిధి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీ, పెండింగ్ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.సమావేశంలో రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాల ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను జిల్లా కలెక్టర్ నేరుగా కారణాలు అడిగి తెలుసుకున్నారు. రికవరీలో వెనుకబడడానికి దారితీసిన అంశాలను విశ్లేషించి, ఆయా మండలాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేదని, మండల స్థాయిలో పెండింగ్ బకాయిలు అధికంగా ఉన్నాయని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీ శాతం కేవలం 13.5 శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రంలో జిల్లా 31వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రికవరీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 239 వీవోల వద్ద సున్నా కలెక్షన్లు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం, పాల్వంచ, ఇల్లందు, అశ్వరావుపేట ప్రాంతాల్లో రికవరీ శాతం తక్కువగా ఉందని పేర్కొంటూ, ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి రుణ గ్రహీతలను కలిసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. బకాయిలు ఉన్న ప్రతి మహిళా సంఘాన్ని గుర్తించి, రుణాల సకాల చెల్లింపుపై సభ్యులకు అవగాహన కల్పిస్తూ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.వచ్చే రెండు నెలల్లో కనీసం 60 శాతం రికవరీ సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ప్రతి రోజు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు రికవరీ పురోగతిపై నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో రోజువారీ సమీక్షలు నిర్వహించి లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని, మెరుగైన పనితీరు కనబరిచిన మండలాలను అభినందిస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై బాధ్యత నిర్ధారణ చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్త్రీ నిధి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, స్త్రీ నిధి రుణాల రికవరీ పెంపు ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండలాల వారీగా ప్రత్యేక రికవరీ ప్రణాళిక రూపొందించి, వీవోలు, ఏపీఎంలు, మండల సమాఖ్యలు ప్రతిరోజూ రికవరీ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యక్తిగతంగా కలిసి రుణాల చెల్లింపుపై అవగాహన కల్పించాలని, అవసరమైతే ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.సకాలంలో రుణాలు చెల్లించే సంఘాలను ప్రోత్సహించడంతో పాటు, జాప్యం చేస్తున్న సంఘాలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. రికవరీలో వెనుకబడిన మండలాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ రోజువారీ పురోగతిని సమీక్షిస్తామని చెప్పారు. సకాలంలో రుణాల చెల్లింపు వల్ల మహిళా సంఘాల ఆర్థిక విశ్వసనీయత పెరిగి, భవిష్యత్తులో అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.అనంతరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వీవో భవనాల పురోగతి, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల స్థాపనకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి మహిళా సంఘాలకు మరింత ఆదాయ వనరులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, డిపిఓ అనూష, అడిషనల్ డిఆర్డిఏ నీలేష్,సంబంధిత అధికారులు, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, వీవోలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ