తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డీజేలు, క్రాకర్స్కు అనుమతి లేదు: డీఎస్పీ అరుణ్ కుమార్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను డీఎస్పీ అరుణ్ కుమార్ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమానికి ఎవరూ రావద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు.అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, క్రాకర్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన ప్రాంతంలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, నది పరిసరాల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిమజ్జన బందోబస్తు కోసం సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో డిడిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ రక్షణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ