తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ముందుగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పుష్పగుచ్ఛం అందించి జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నుంచి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల షెడ్ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్డేట్ చేయాలని, సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్–100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీతో పాటు అధికారులు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ