తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జాటోత్ రామ్ చంద్ర నాయక్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. “భద్రాచలం పునర్నిర్మాణం మరియు పునరుజ్జీవనం” ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రణాళికల పై చర్చించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి నిలయమని, ఆలయం, పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. యాత్రికుల సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్కింగ్ సదుపాయాలు, రహదారుల విస్తరణ, పరిశుభ్రత పరిరక్షణ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాడ వీధుల అభివృద్ధి, కల్యాణ మండప నిర్మాణం, రామవనం అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, తాగునీటి సరఫరా, శుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. కల్యాణ మండపాన్ని ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను సమృద్ధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక చర్యలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఇతర అధికారులు, ప్రాజెక్ట్ రూపకర్తలు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ