తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్, కొత్తగూడెం ఆర్డీవోతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులో పరిష్కారం అందించేలా చర్యలు పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: 1. దుమ్ముగూడెం మండలం చిన్న కమలాపురం గ్రామానికి చెందిన పూనెం ముత్తయ్య తన తండ్రి పేరుమీద ఉన్న పట్టాదారు భూమిలో 5.48 సెంట్లు తన పేరుమీదకు మార్పిడి చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. చలాన్ కట్టినప్పటికీ పట్టా మంజూరు కాలేదని చేసిన దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం సంబంధిత సి సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. 2. పాల్వంచ 44వ డివిజన్ గాంధీనగర్కు చెందిన వీరమల్ల దుర్గారాణి ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తాను డిగ్రీ (B.A), ఐటీఐ పూర్తి చేసిన నేపథ్యంలో ఉపాధి కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. 3. పాల్వంచ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన కృష్ణ తన ఆధీనంలో ఉన్న 8 ఎకరాల భూమిలో 2016లో 6 ఎకరాలు, ఇటీవల మిగిలిన 2 ఎకరాలు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, జీవనాధారం కోల్పోయానని వాపోయారు. తనకు భూమి తిరిగి ఇవ్వాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి పాల్వంచ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO)కు ఎండార్స్ చేశారు. 4. భద్రాచలం పట్టణానికి చెందిన నొల్లి గోవిందమ్మ (భర్త: నొల్లి ప్రసాద్) గత 25 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, ఇప్పటివరకు సొంత ఇల్లు లభించలేదని తెలిపారు. తన భర్త 89% అంగవైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గృహం మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు. 5. కొత్తగూడెం విద్యానగర్ కాలనీ 5వ వార్డుకు చెందిన లంక లీలా వితంతు పెన్షన్ కోసం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వెరిఫికేషన్ పూర్తయ్యినా ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొంటూ త్వరగా వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరిన దరఖాస్తును కలెక్టర్ తగు చర్యల నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ