తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా కవి కాళోజి సేవలు చిరస్మరణీయం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు.ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ తో కలసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, భాషలకు చిరస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టారని తెలిపారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడు, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వివరించారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ సాధారణ ప్రజల హృదయాలను తాకిన రచనలు ఆయనవి కావడంతోనే “ప్రజాకవి” అనే బిరుదును అందుకున్నారని చెప్పారు. కాళోజీ రచనలు ప్రజలకు ధైర్యాన్ని, సామాజిక అవగాహనను కలిగించాయని, ఆయన చూపిన మార్గం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాలు, సమస్యలను తన కవిత్వంలో ప్రతిబింబించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించడం గర్వకారణమని తెలిపారు. కాళోజీ జయంతి ని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆయనకు ఇవ్వబడిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జయంతి వేడుకలు తెలంగాణ భాష, సాంప్రదాయం, సంస్కృతిని కాపాడుకునే దిశగా సమాజానికి స్ఫూర్తి కలిగిస్తాయని వివరించారు. భాషా వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కాళోజీ చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, ఓ ఎస్ డి వెంకటరమణ,ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ