తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.గోదావరి వరదల నేపథ్యంలో నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష.భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాల్లో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, గోదావరి వరదల నేపథ్యంలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని సమీక్ష నిర్వహించారు.గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే నిర్మాణ సామగ్రి, యంత్రాలు, విద్యుత్ పరికరాలను భద్రంగా ఉంచడంతో పాటు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర మార్గాలను అందుబాటులో ఉంచడం, రద్దీ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును మరింత పటిష్ఠం చేయడం, నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం వంటి అంశాలపై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు. వరద పరిస్థితుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు అమలు చర్యల గురించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.భక్తులు, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఆలయ అధికారులు, పోలీసు శాఖ, ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఆలయ నిర్మాణ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ