తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గంజాయి హాట్స్పాట్స్పై ప్రత్యేక నిఘా – ప్రాపర్టీ కేసుల డిటెక్షన్ పెంచాలి నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం నాడు పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ ఆధారాలతో పటిష్ఠమైన దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం సహించబోమని హెచ్చరిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య, నాట్గ్రిడ్ వంటి సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గంజాయి హాట్స్పాట్స్ను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ప్రాధాన్యతగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో త్వరితగతిన ఛేదించి దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించాలని సూచించారు. వాహన తనిఖీలు, రాత్రి పెట్రోలింగ్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ రోడీషీటర్లు, హిస్టరీషీటర్లు, బెయిల్పై ఉన్న నేరస్థులు, జైలు నుంచి విడుదలైన వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, డయల్-100కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ