తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ, వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు మరియు సహాయక చర్యలపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి హరిచందన, రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) ఉన్నతాధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాణనష్టాన్ని నివారించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందించేలా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC) నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలసి పాల్గొని, బూర్గంపాడులో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం బూర్గంపాడు మండలంలోని అంబేద్కర్ నగర్, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రెస్క్యూ, పునరావాస చర్యలను పరిశీలించారు.ఫైర్ శాఖ అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్కు ఆరవ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన కే. శంకర్, సీఆర్పీఎఫ్ కమాండర్ రాజేష్ దోగ్రా అబ్జర్వర్లుగా వ్యవహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను లైఫ్ జాకెట్లు, బోట్లు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అంబులెన్స్ల ద్వారా పునరావాస కేంద్రాలకు చేర్చడం, బాధితులకు త్రాగునీరు, భోజనం, వైద్య సేవలు, తాత్కాలిక నివాస సదుపాయాలు కల్పించడం వంటి చర్యలను డెమో రూపంలో ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు ఎస్సీ కాలనీ నుంచి 10 మంది గర్భిణీలు, 45 మంది చిన్నారులు సహా మొత్తం 200 మందిని, 26 పశువులను సురక్షితంగా బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ బాధితులకు తక్షణ వైద్య సేవలు, ఆశ్రయం, త్రాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించారు.వివిధ శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పశుసంవర్థక శాఖల సిబ్బంది సమన్వయంతో సేవలు అందించారు. గజఈతగాళ్ల సహాయంతో చేపట్టే రెస్క్యూ విధానాలను కూడా ప్రాక్టికల్గా ప్రదర్శించారు.బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, ఆపరేషన్ సెంటర్లు, వైద్య శిబిరాలను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. బాధితులకు అందిస్తున్న త్రాగునీరు, భోజనం, తాత్కాలిక నివాస సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాల ద్వారా అందిస్తున్న సేవలు, మందుల పంపిణీ, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని కూడా పరిశీలించి, పశువులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిబ్బంది (EMC), రెవెన్యూ సిబ్బంది బాధితులకు సమన్వయంతో సేవలు అందించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు అప్రమత్తత, శాఖల మధ్య సమన్వయం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చన్నారు. ఎన్సీసీ విద్యార్థులతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో వారు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో “గోల్డెన్ అవర్”లో తీసుకునే చర్యలు ప్రాణ రక్షణకు కీలకమని, శాఖల మధ్య సమన్వయం ద్వారా తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇలాంటి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, బూర్గం పహాడ్ తాసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు,ఎన్ డి ఆర్ ఎఫ్,ఎస్ డి ఆర్ ఎఫ్,ఎన్ ఎన్ సి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ